Thursday, May 9, 2013

కృష్ణరాయలు-అస్తిత్వాల ప్రశ్నలు: -పాణి

రాజుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే .. అని ముప్పై ఏళ్ల కింద చెరబండరాజు అన్నాడు. సంస్కృతి, చరిత్ర అఖండం కావని, రాజరికపు సంస్కృతీ చరిత్రల కింద ప్రజల సంస్కృతి, జీవితం అణగారి పోయాయనే సత్య ప్రకటనే ఆ కవిత్వం. అందులో ఆయన రాళ్లకు పూవుల పరిమళం అంటదని కూడా అంటాడు. మట్టిలో పుట్టి పెరిగిన పూవుల గుబాళింపే నిజమైన చరిత్ర అర్థం. గత కాలంలోని ఉజ్వల ఘట్టాలు ఆధిపత్య వ్యవస్థలకు సంబంధించినవి అయినప్పుడు వాటిని విమర్శనాత్మకంగా చూడాలి.

లేకపోతే చరిత్ర పురోగామి స్వభావాన్ని విస్మరించినట్టే . రాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాల్లో శ్రీకృష్ణదేవరాయలు నేటికీ మనకు ఆదర్శమని పాలకులు అనడం దురదృష్టకరమేమీకాదు. వారు అనవలసిన మాటే అన్నారు. ఐదు వందల ఏళ్ళకిందటి రాజు రాజరిక పాలన, ఆధునిక యుగం లో, ప్రజాస్వామ్యమని చెప్పుకుంటున్న సమాజంలో ఎట్లా ఆదర్శ ప్రాయమనే సందేహం మన పాలకులకు ఇసుమంత కూడా కలగదు. మన ప్రజాస్వామ్య స్వభావానికి అతికిన మాటే అది. అందువల్ల పాలకులు రాయల ఉత్సవాలు జరపడంలో అనౌచిత్యం ఏమీలేదు. అంతవరకే అయితే ప్రమాదం కూడా లేదు. ఇంకా చాలారకాల వాళ్లు వివిధ స్థాయిల్లో ఈ సంరంభంలో భాగమయ్యారు.

చరిత్రలో జనరంజక ఘట్టాలుగా బహుళ ప్రాచుర్యం పొందిన వాటిని పామరోచితంగా స్వీకరించడమేనా? అనే చరి త్ర సంబంధమైన ప్రశ్నను రాయల ఉత్సవాలు మరోసారి ముందుకు తెచ్చాయి.గత వైభవాల తలపోతకు చారిత్రక దృష్టి అవసరం లేదు. రాయల స్వర్ణయుగం అనే అయిదో తరగతి చరిత్ర పాఠం సరిపోతుంది. ఈనాటి పాలకుల దుర్మార్గాన్ని, ఇప్పటి సమాజ సంక్షోభాన్ని దగ్గరగా చూస్తుంటే ఆ రోజులే నయం అని ఎవరైనా అనుకోవచ్చు. ఆ రోజుల్లో ఏదో మానవాంశ ఉందనిపించవచ్చు.

అంతమత్రాన ఆధునిక యుగాని కంటే రాజరికం గొప్పదైౖ పోదు. ఎన్ని అవలక్షణాలున్నా ఆధునికత, ప్రజాసామ్యం రాజరికానికంటే చరిత్రలో ప్రగతిశీలమైన వి. అయిదే వందల ఏళ్లకింద ఓకానొకరాజు పట్టాభిషేకం తెలుగువారందరికి, తెలుగు జాతి లోని అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు , వర్గాలకు ఎందుకు ఉత్సవం కావాలి?

రాయల ఉత్సవాలకు మూడు రకాల శక్తులు పూనుకున్నా యి. గతాన్ని ఆరాధించే సంప్రదాయ, తిరోగమన వాదులు; తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమకారులు; బలిజ కుల సంక్షేమ సంఘాల నాయకులు. ఈ మూడు బృందాల దృక్పథాలు, ప్రయోజనాలు ఒక్కటి కాదు. మొదటి బృందం పాత సమాజ అవశేషంగా వర్తమానంలో ఊపిరి తీస్తోంది. వాళ్ల భాష, వాద న, వ్యక్తీకరణ రక్తికట్టించలేని సోషల్ ఫాంటసీ. అయితే వీళ్లకు యింక ఆ చాలాకాలం ఈ నేల మీద చోటు ఉంటుంది.

అది వేరే కత. రెండో బృందంలోని వాళ్లు ఆధునికులు. ఆంగ్ల భాషా సామ్రాజ్యవాదం ముందు వెల వెలబోతున్న తల్లి భాషల పెనుగులాట వాళ్ల గొంతులో వినిపిస్తుంది. కానీ భాషలోని వైవిధ్యాన్ని, మాతృభాషా సంక్షోభాన్ని రాజకీయార్థిక పునాది మీద వివరించే పరికరాలేవీ వీళ్ల దగ్గర ఉండవు. ఎవరి మాతృభాష, ఏ కుల, ప్రాంత, వర్గాల మాతృభాష? అనే ప్రశ్నలు కీకారణ్యం గా తోచి, అక్కడి నుంచి తప్పించుకొని తాము స్వరపరచుకున్న గీతాన్నే మరింత దట్టించి ఆలపిస్తారు.

భాష సామాజిక ఉత్పత్తి అని తెలియదు కాబట్టి రాయలవారి భాషా సంస్కృతిక సేవ తలుచుకోగానే పులకాకింతులవుతారు. ఎవరి మాతృభాషా పరిరక్షణ ఉద్యమం ఇది అని దళితులో, తెలంగాణ వాళ్ళో ప్రశ్నిస్తే ఇబ్బంది పడిపోతారు. తమ ఉద్యమానికి చరిత్రలో ఒక బలమైన ఆలంబన కావాలి కాబట్టి సహజంగానే రాయలు స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. ఈ ఉత్సవాల కంటే ముందు నుంచి భాషా పరిరక్షణ ఉద్యమం రాయల ప్రాభవాన్ని గానం చేస్తున్నది. అచ్చ తెనుగు మీద, మాండలికాల మీద వీళ్ల మక్కువను కాదనలేం, కానీ వీళ్ల మాతృభాషా హృదయాన్ని 'ప్రామాణికం' అనే రూపంలో సంప్రదాయం ఆవరించి ఉంది.

మూడో బృందం - స్వీయ అస్తిత్వం కోసం వెతుకుతున్న బలిజ కులస్తులు. తమ కులంలోని ఒక ప్రభావశీల వ్యక్తితో తమ సామాజిక పరంపరను ప్రతీకాత్మకంగా మలుచుకోవడం అస్తిత్వ స్పృహలో భాగం. ఒక సామాజిక బృందం తనను తాను ఎలా చూసుకుంటుంది, ఇతరులు ఆ బృందాన్ని ఎలా చూస్తారనేది అస్తిత్వానికి సంబంధించిన ముఖ్యమైన అంశం.

తమ కులం నుంచి రాజరికంలోకి ప్రవేశించిన వ్యక్తిగా బలిజ కులస్తులకు రాయలు అస్తిత్వ ప్రతీక అయ్యాడు. ఆ కులానికి అనేక సామాజిక అనుభవాలు, ప్రత్యేకతలు ఉన్నాయి గదా? ఒక రాజు ఎందుకు ప్రతీక కావాలని అంటే వాళ్లు వింటారని నమ్మకమేం లేదు. అయితే సాహు మహరాజ్‌తో పోల్చితే రాయల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు. యాదవుల కయితే పౌరాణిక పాత్ర అయిన శ్రీకృష్ణుడు కుల ప్రతీక అయ్యాడు. స్వీయ అస్తిత్వానికి బైట పుట్టిన వాళ్లు ఏ మాటయినా చెప్తే శంకించడం, దురుద్దేశ్యాలున్నాయనడం అస్తిత్వ చైతన్యంలో అంతర్నిహితం.

ఈ మూడింటితో పాటు రాయలసీమ అస్తిత్వ స్నృహ కూడా రాయల వేడుకల్లో ఉన్నట్టుంది. ఆ ప్రాంతం వాళ్లు రాయలతో ఐడెంటిఫై కావడానికి రాయలసీమ అనే మాటే చాలు, రెండో మాట అక్కర్లేదు. రేప్పొద్దున ఆ ప్రాంత అస్తిత్వ స్పృహ నిలదొక్కుకుంటే అందులో రాయలవారు స్థిరపడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణలో ఇది చూస్తునే ఉన్నాం. తెలంగాణ వాదులు తమ ఉజ్వలమైన సంప్రదాయాలను, ప్రత్యేకతలను పునర్నిర్మించే పనిలో పనిగా నిజాం నవాబుకు కూడా సముచితస్థానం ఇచ్చేశారు. కోస్తాంధ్ర వలసవాదులతో వాళ్లు- మీ విక్టోరియా మహారాణి, మా నిజం నవాబు అని సంవాదం చేశారు.

రాయల ఉత్సవాల సందర్భం గా చారిత్రక దృక్పథం, భాషా సాహిత్య విషయాలు, అస్తిత్వ స్పృహ మొదలైనవి మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. చరిత్ర గురించి పిట్టకథలు ప్రచా రం కావడం కూడా చరిత్ర ప్రాబల్యాన్ని, వర్తమాన ప్రజలకు గతం తో ఉండే పేగు బంధాన్ని సూచిస్తుంది. చరిత్ర అనే సామాజిక శాస్త్రం పట్టుబడని సమాజంలో పౌరాణికాలు, పిట్టకథలే చలామణిలో ఉంటాయి. రాయలనాటి వైభవం అంతఃపుర వైభవమా? ప్రజా వైభవమా? అనే ప్రశ్న చారిత్రక దృష్టికి సంబంధించింది.

విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర మినహా మెట్ట వ్యవసాయం కింద నిర్మాణమైంది. కనీసం తెలుగు ప్రాంతం వరకైనా, అప్పుడు రత్నాలు రాసులు పోసి అమ్మినారనే గాథ వెనుక ఏ ముందో తెలుస్తుంది. మెట్ట ప్రాంతంలో రాజరికాన్ని నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలో రాయలకు బాగా తెలుసని చెప్పవచ్చు. దీనికి ఆయన చేపట్టిన నీటి పారుదల పద్ధతులు మంచి ఉదాహరణ.

బహుశా రాజులు, సంస్థానాధీసు లు చాలావరకు ఇలాంటి పద్ధతులు పాటించిన వాళ్లే. వీటి అమలులో రాజుల ఉద్దేశ్యాలే గాక ప్రజల పరంపరాగత జ్ఞానం కూడా ఉన్నది. రాయల ప్రాభవం గురించి కథనాలున్నట్టే ప్రజా జీవితం దుర్భరంగా ఉండేదనడానికి చాలా ఆధారాలున్నాయి. రాజరిక వ్యవస్థకు భిన్నంగా రాయల సామ్రా జ్యం మాత్రం ఎట్లా ఉండి ఉంటుంది? రాయలు ఒక ఆధిపత్య వ్యవస్థకు మేటి ప్రతినిధి. విజయనగర సామ్రాజ్యం కింద ఉన్న భూభాగంలో నిత్య యుద్ధాలతో పాటు సుస్థిర పాలన కొనసాగింది కృష్ణ రాయల కాలంలోనే. పల్లెల నుంచి సంపద కొల్లగొట్టకుండా సుస్థిర పాలన, పటిష్టమైన సామ్రాజ్య విస్తరణ, నిర్మా ణం సాధ్యం కాదు.

రాయల భాషాభిమానం అంతఃపుర సంప్రదాయానికి చెందినది. ఇది రాజరిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. అంతకంటే భిన్నంగా ఉంటుందనుకోవడం చరిత్ర పట్ల అమాయకమైన ప్రేమే. రాయల భాషా సేవ ప్రాతిపదిక మీద ఆయనతో తెలుగు ప్రజలందరి మమేకత సాధించాలనుకోవడం చారిత్రక దృక్పథం అనిపించుకోదు.

కన్నడరాయుడుగా పేరు పొందన రాయలను తెలుగు రాజుగా చూపడానికి చేస్తున్న ప్రయత్నాలలో జాతి ప్రాతిపదిక ఉన్నది. ఆయన తెలుగువాడు అవునా కాదా అనే చర్చలోకి పోవడం లేదు గాని, జాతి భావనను రాజుల ఆధారంగా కూడా నిర్మిద్దామనే ప్రయత్న మది. మాతృభాషా ఉద్యమానికి పాల్కుర్కి సోమనాథుడు, వేమన , వీర బ్రహ్మం స్ఫూర్తి అవుతారు కాని రాయలు కాడు. రాయలసీమ అస్తిత్వానికి కూడా ఆధిపత్య వ్యవస్థ ప్రతినిధి అయిన రాÄలు ప్రతీక కాజాలడు.

అస్తిత్వ భూమిక మీదికి వెళ్లాక చరిత్ర గురించిన వాస్తవిక దృష్టి కొరవడుతుందని రాయలచుట్టూ తిరుగుతున్న తెలుగు ఆలోచనా పరులు రుజు వు చేస్తున్నారు. ఎవరి మాతృభాష? ఎవరి సాహిత్యం? అని ప్రశ్నించిన అస్తిత్వ చైతన్యంలోకి రాజరికం-ప్రజలు మౌలిక విభజన విస్మరణకు గురైందని చెప్పక తప్పదు. రాజరికం ఒక రాజకీయార్థిక సాంఘిక వ్యవస్థ అనే విషయాన్ని పక్కన బెట్టి జాతి సాంఘిక అస్తిత్వం , భాషా సంస్కృతుల తలపోత ఇది. 'తెలుగు భాషలెస్స' అన్నాడు కాబట్టి రాయలు తెలుగు భాషా సాహిత్య వికాసానికి , బలిజ కులంలో పుట్టాడు కాబట్టి ఆ కులస్తులకు, రాయల పాలనలో ఉన్న భూ భాగం కాబట్టి రాయలసీమ వాళ్లకు ప్రతీక కావడం దీని వల్లనే.
-పాణి(Andhra jyothy: 21 july 2010)